viswatelangana.com
Date of Publish : 10 June 2025, 1:22 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అట్టహాసంగా గ్లోబల్ హైట్స్ స్కూల్‌లో భగవద్గీత పారాయణ పోటీలు

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కల్లూర్ రోడ్డులో గల ప్రముఖ విద్యా సంస్థ గ్లోబల్ హైట్స్ స్కూల్ ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణ శ్లోకాల పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సనాతన ధర్మ పరంపరను కొనసాగిస్తూ, విద్యార్థుల్లో ఆధ్యాత్మికత, నైతిక విలువల పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోటీలో విద్యార్థులు ఎనలేని ఉత్సాహంతో పాల్గొని తమ పారాయణ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా చంద సాయి వర్షిత్ 52 శ్లోకాల పారాయణంతో మొదటి బహుమతి అందుకోగా, ఓడ్నాల సాయి ఆకృతి 42 శ్లోకాలతో రెండవ బహుమతి, బండ్ల హర్షిత్ 42 శ్లోకాలతో మూడవ బహుమతి అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా సత్సంగు ప్రముఖ్ కందేశి లక్ష్మీనారాయణ, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు ఓడ్నాల రామారావు, చైల్డ్ వెల్ఫేర్ సభ్యుడు ఓటరికారి శ్రీనివాస్, అడ్వకేట్, సత్సంగు నేత చింత సూర్యనారాయణ ప్రసాద్, స్కూల్ ప్రిన్సిపాల్ గట్ల లక్ష్మి, అకాడమిక్ డైరెక్టర్ గట్ల ప్రకాష్, హిందూ వాహినీ జిల్లా అధ్యక్షుడు కొండబతిని అమర్నాథ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భగవద్గీత శ్లోకాల పఠనం ద్వారా విద్యార్థులలో అభ్యుదయ భావనలు, ఆత్మవిశ్వాసం, ధర్మబద్ధత పెంపొందుతాయని పేర్కొన్నారు. విద్య అనేది పుస్తకాలకే పరిమితం కాకుండా జీవితానికి మార్గదర్శకంగా ఉండాలని, ఆ దిశగా గీతా పారాయణం ఉపయోగపడుతుందన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్లో ఆధ్యాత్మికతపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రోత్సహించాలన్నారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన స్కూల్ యాజమాన్యాన్ని అతిథులు, ప్రముఖులు హృదయపూర్వకంగా అభినందించారు.

Change News Type