viswatelangana.com
Date of Publish : 05 July 2025, 12:55 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పాపం… పసిపాప దారుణ హత్య – కోరుట్లలో కలకలం

కొందరు రాక్షసుల హృదయాల్ని కలిగివుంటారు అనిపించేలా దారుణ ఘటన కోరుట్ల పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అన్యం పుణ్యం తెలియని ఐదేళ్ల పసిపాప హితిక్షను దారుణంగా హత్య చేసిన ఘటన పోలీసుల గుండెల్ని సైతం కలిచి వేసింది. పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన ఆకుల రాము కుమార్తె హితిక్ష (5) శనివారం సాయంత్రం ఆడుకుంటూ ఇంటి బయటికి వెళ్లిన తరువాత కనిపించకుండా పోయింది. ఆ పాపను ఇంటివారు, బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఒక పక్క ఆందోళనతో గడిపిన కుటుంబానికి క్షణికాన్ని తట్టుకోలేని వార్త ఎదురు అయింది. ఇంటి సమీపంలోని ఓ ఇంట్లోని బాత్రూమ్‌లో హితిక్ష శవమై కనిపించింది. ఊహించని విధంగా గొంతు కోసి హత్య చేయబడి ఉండటంతో, చూసినవారికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఈ అమానుష ఘటన స్థానికులను తీవ్ర మనోవేదనలోకి నెట్టేసింది. పాప తల్లిదండ్రుల రోదన, ఆవేదన మాటల్లో చెప్పలేనిది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారిని ఈ పాశవిక హత్యకు గురి చేసిన మానవ మృగం ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్థానికులు “కోరుట్ల అంటే క్రైమ్‌కు కేంద్రంగా మారిందా.? అపరాధాలకు అడ్డాగా మారుతుందా..? అని ప్రశ్నిస్తున్నారు. ఈ రకమైన అమానుష ఘటనలు పునరావృతం కాకుండా, చిన్నారులు, ప్రజలు భయభ్రాంతులు లేకుండా జీవించే సమాజం కోసం పోలీసులు శాశ్వత పరిష్కారాలు తీసుకురావాలని స్థానికులు ఆశిస్తున్నారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసి, నేరస్థుడిని త్వరితగతిన గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రజలు ప్రభుత్వాన్ని, పోలీసులను కోరుతున్నారు.

Change News Type