viswatelangana.com
Date of Publish : 06 March 2024, 1:37 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి

కోరుట్ల పట్టణంలోని జిజిఆర్ గార్డెన్స్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహిళా ,స్వశక్తి సంఘాల మేగా రుణ మేళా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రీజనల్ హెడ్ శంకర్ హెంబ్రం మాట్లాడుతూ.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరుట్ల పట్టణంలోని 2 శాఖలు, మేడిపల్లి మరియు చల్ గల్ శాఖ తరపున మహిళా సంఘాలకు సంబంధించి 60 మహిళా సంఘాలకు గాను 5 కోట్ల 60 లక్షల రూపాయల రుణాలను మంజూరు చేస్తున్నామని.. వాటిని సద్వినియోగం చేసుకుని మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడుతూ ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా మరికొంత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆయన సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ బ్రాంచిల ద్వారా అనేక రకమైన పథకాలు, రుణాలు అందిస్తున్నామని.. వాటిని అందిపుచ్చుకొని ఆర్థికంగా వృద్ధి సాధించాలని ఇందుకోసం తమకు నచ్చిన రంగంలో, అనుభవం ఉన్న రంగాల్లో బ్యాంకులు అందించే రుణ సదుపాయాలను పొంది యూనిట్లు ప్రారంభించి ఇతరులు అభినందించేలా, స్పూర్తిని పొందేలా కార్యచరణ రూపొందించు కోవడమే కాకుండా తగిన కృషి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ లావాదేవీల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటమే కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కోరుట్ల మున్సిపల్ కమిషనర్ తిరుపతి మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు రుణాలు తీసుకుని తిరిగి చెల్లించే విషయంలో రాష్ట్రం లోనే అగ్రస్థానంలో ఉండడం సంతోషకరమని, జిల్లా పరిధి లోని వివిధ మహిళా సంఘాల సభ్యుల ద్వారా నడపబడుతున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు విజయ పథంలో పనిచేస్తున్న తీరుని వివరిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ శివ కోటయ్య, వివిధ శాఖల మేనేజర్లు షఫీక్, వినోద్, చేతన్, ఆశిష్,జిల్లా ఎఫ్ఎల్సీ మధు సూదన్, సెర్ప్ ఏపిఎంలు శంకర్, గంగాధర్, అశోక్, నరహరి, మెప్మా టిఎంసీ శ్రీరామ్ వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు

Change News Type