మేడారాన్ని మూడుసార్లు సందర్శించి వన దేవతలను దర్శించుకున్నానని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అన్నారు. శుక్రవారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ శ్రీజలతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భారతదేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యంగా గిరిజనులు ఐక్యంగా ఉండి సంతోషంగా ఉండాలని వన దేవతలను మొక్కుకున్నట్లు గవర్నర్ తన మనసులో మాటను బయటపెట్టారు. గవర్నర్ హోదాలో ఇప్పటి వరకు మేడారం మూడు సార్లు సందర్శించి అమ్మవార్లను దర్శించి మొక్కులు అప్పచెప్పడం అదృష్టంగా భావిస్తున్నట్లు తమిళసై అన్నారు. గిరిజనులను అభివృద్ది చేయాలనే తనకున్న బలమైన కోరికతో ఇక్కడి 6 గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు.