రాయికల్

భూ భారతి పై అవగాహన సదస్సు

viswatelangana.com

April 29th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

సాదా బైనామలపై కొనుగోలు చేసిన భూములకు “భూ భారతి”నూతన ఆర్వోఆర్ చట్టంలో పరిష్కారం లభిస్తుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్,ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లు పేర్కొన్నారు.మంగళవారం రాయికల్ పట్టణ కేంద్రంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టంపై రైతులకు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ మాట్లాడుతూ….తెల్ల కాగితాలపై కొనుగోలు చేసిన సాధా బైనామా భూములకు పట్టాలు అందించాలని గత ప్రభుత్వం తీసుకున్న దరఖాస్తుల పరిష్కారంపై ధరణిలో అవకాశం లేనందున హైకోర్టు స్టే విధించిందని, పెండింగ్ సాధా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టం సెక్షన్ 6 క్రింద ఆర్డీఓ లకు బాధ్యతలు అందించిందని అన్నారు.చిన్న,సన్నకారు రైతులు 2014 కంటే ముందు కొనుగోలు చేసిన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు మాత్రమే సాధా బైనామా పట్టా లభిస్తుందని,గడిచిన 12 ఏళ్ళలో సాధా బైనామా భూముల అనుభవంలో ఉన్న వారికి మాత్రమే దరఖాస్తులు పరిష్కారం అవుతాయని తెలిపారు.భూ భారతి చట్టం ద్వారా పక్కగా భూ సరిహద్దులు నిర్ణయిస్తారని, రైతులకు, భూ హక్కుదారులకు ఉచిత న్యాయసాయం అందుబాటులో ఉంటుందని అన్నారు. భూ భారతి చట్టం ప్రకారం అధికారులు అందించిన ఆర్డర్ల పై సంతృప్తి చెందకుంటే బాధితులు అప్పిల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కుల సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ జరిపి రికార్డుల్లో మ్యూటేషన్ చేస్తారని,నిర్ణీత గడువు 30 రోజులలోగా మ్యూటేషన్ పూర్తి చేయకుంటే ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు. భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ముందు తప్పనిసరిగా భూమిసర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు.భూముల విస్తీర్ణం మార్పులు చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లు భూమికి “భూదార్ కార్డు” అందించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ…..గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వ్యవస్థ వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని,15 నెలల నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి పేద ప్రజలకు న్యాయం జరిగేలా భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టం ప్రవేశ పెట్టారని అన్నారు.భూ భారతి చట్టం ప్రవేశం పెట్టడమే కాకుండా అధికారులను గ్రామాలకు పంపి భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం లో రైతులు పండించిన సన్న ధాన్యం కు నేడు యాసంగి సీజన్ లో కూడా ప్రభుత్వం క్వింటాల్ వడ్లకు రూ.500 బోనస్ అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి పి.మధుసూదన్, తహసీల్దార్ అబ్దుల్ ఖయ్యూం, ఎంపీడీవో బింగి చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఏఎంసీ చైర్మన్లు, రైతులు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button